కలం, వెబ్ డెస్క్ : ఇందిరమ్మ ఇళ్ల (Indiramma indlu) నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రస్తుత పరిస్థితుల్లో సరిపోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj gopal Reddy) అన్నారు. నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడంతో పాటు మేస్త్రీల కూలీ ఖర్చులు కూడా అధికమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే కనీసం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చవుతోందని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణంలో మేస్త్రీలు, కార్మికుల కూలీలకే రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతోందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మరోవైపు ఇటుకలు, ఇసుక, సిమెంట్, ఇనుము తదితర నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో లబ్ధిదారులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని వివరించారు.
బడ్జెట్ పెంచాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ నిర్మాణం ప్రారంభించలేకపోతున్న కుటుంబాలు చాలానే ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సాయం నిర్మాణ ఖర్చులకు సరిపోకపోవడంతో కొంతమంది లబ్ధిదారులు (Beneficiaries) ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మరికొందరు అప్పులు చేయడంతో పాటు తమ వద్ద ఉన్న బంగారాన్ని కుదవపెట్టి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు. పేద కుటుంబాలు సొంతింటి కలను సాకారం చేసుకునేలా ఇందిరమ్మ ఇళ్లకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని ప్రస్తుత నిర్మాణ వ్యయాలకు అనుగుణంగా పెంచాల్సిన అవసరం ఉందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బడ్జెట్ను పెంచి అదనపు భారం లేకుండా చూడాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు.

