కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District), మణుగూరు మండల శివారులో శనివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 40 గొర్రెలు మృతి చెందాయి. మణుగూరుకు లేయర్ కోళ్లను తీసుకువస్తున్న వాహన డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి రోడ్డు పక్కన గడ్డి మేస్తున్న గొర్రెల పైకి వేగంగా కోళ్ల ట్రక్కుతో దూసుకెళ్లాడు. దీంతో 40 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొన్ని గొర్రెల కాళ్లు విరిగిపోయాయి.
ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా తెల్లవారు జామున గొర్రెలను మేపడానికి వచ్చానని, కానీ అనుకోని అనర్థం జరిగిపోయిందని గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తం చేశాడు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లనే ఈ దారుణం జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

