కలం, వెబ్ డెస్క్ : ముంబై నుంచి దుబాయ్కి బయలుదేరిన ఎమిరేట్స్ విమానానికి (EK 501) (Emirates Airlines)ఆకాశంలో ఆందోళనకరమైన పరిస్థితి ఎదురైంది. విమానం గమ్యస్థానానికి చేరుకోవాల్సిన సమయంలో, ఆ దేశంపై మిస్సైల్ దాడులు జరుగుతున్నాయనే హెచ్చరికలు అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా పైలట్ విమానాన్ని గగనతలంలోనే రెండు సార్లు వెనక్కి తిప్పాల్సి వచ్చింది.
సాధారణంగా విమానాలు ఏదైనా సాంకేతిక లోపం లేదా వాతావరణం సరిగ్గా లేనప్పుడు ఒకసారి వెనక్కి రావడం చూస్తుంటాం, కానీ ఇలా ఒకే ప్రయాణంలో రెండు సార్లు ‘డబుల్ రివర్స్’ తీసుకోవడం అత్యంత అరుదైన విషయమని విమానయాన అధికారులు పేర్కొంటున్నారు. గగనతలంలో ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, చివరకు భద్రతా పరిస్థితులను సమీక్షించిన అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విమానం సురక్షితంగా దుబాయ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు, ఎయిర్లైన్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

