కలం, వెబ్ డెస్క్: డాక్టర్ విక్రాంత్ సింగ్ (Vikrant Singh Thakur) సోషల్ మీడియా వేదికగా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ తరచూ వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలపై ఆయన అనేక వీడియోలు చేశారు. తాజాగా ఆయన విడుదల చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. డిమార్ట్, షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాలలో ఇచ్చే బిల్లింగ్ పేపర్లు, అలాగే కరెంటు బిల్లుల పేపర్లు ప్రజలకు హాని కలిగిస్తాయని చెప్పారు.
ఈ రకమైన థర్మల్ పేపర్లను తరచూ చేతులతో తాకడం వల్ల క్యాన్సర్, బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎప్పుడో ఒకసారి టచ్ చేస్తే పెద్దగా సమస్య ఉండకపోవచ్చు కానీ, ప్రతిరోజు వీటిని పట్టుకోవడం దుష్ప్రభావాలకు దారితీసే అవకాశం ఉందని ఆయన వివరించారు.
ఈ ప్రమాదాల నుంచి రక్షణ పొందడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లల చేతులకు ఈ పేపర్లను తాకనివ్వదని స్పష్టం చేశారు. ఒకవేళ ఉద్యోగరీత్యా వీటిని రోజూ తాకాల్సి వస్తే, చేతులకు విధిగా గ్లౌవ్స్ ధరించాలని డాక్టర్ విక్రాంత్ సింగ్ సూచించారు.

