కలం, స్పోర్ట్స్: ఆసియా క్రీడల (Asian Games) వేడుకల్లో భారత్ తరఫున పతాకధారులుగా షూటర్ మను భాకర్ (Manu Bhaker), షాట్పుటర్ తేజేందర్పాల్ సింగ్ తూర్ (Tajinderpal Singh Toor) నిలవనున్నారు. శనివారం జరగనున్న ఐచి-నాగోయా ఆసియా గేమ్స్ ప్రారంభోత్సవంలో వీరిద్దరూ భారత దళాన్ని ముందుండి నడిపిస్తారు. వివిధ క్రీడా రంగాల నుంచి అద్భుతమైన ఫామ్లో ఉన్న వీరిద్దరినీ పతాకధారులుగా ఎంపిక చేశారు. జాతీయ చెఫ్ డి మిషన్ సహదేవ్ యాదవ్ శుక్రవారం రోజు మను భాకర్ ఎంపికను ధ్రువీకరించారు.
ఆ తర్వాత అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తేజేందర్పాల్ సింగ్ పేరును రెండో పతాకధారిగా ప్రకటించింది. మను భాకర్ 2024 పారిస్ ఒలింపిక్స్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. స్వతంత్ర భారతదేశంలో ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్గా నిలిచారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో ఆమె కాంస్య పతకాలు గెలుచుకున్నారు. మరోవైపు 31 ఏళ్ల తేజేందర్పాల్ సింగ్ తూర్ ఆసియా గేమ్స్లో బలమైన రికార్డును కలిగి ఉన్నారు.
ఆయన 2018 జకార్తా గేమ్స్లో, 2023 హాంగ్జౌ గేమ్స్లో స్వర్ణ పతకాలు సాధించి డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్నారు. ఈసారి కూడా పతకం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ప్రారంభోత్సవానికి ముందు కొన్ని నిర్వహణ సమస్యలు తలెత్తాయి. నాగోయా పోర్ట్ గార్డెన్ పియర్లో జరగాల్సిన భారత జట్టు స్వాగత కార్యక్రమం ఆలస్యమై, అకస్మాత్తుగా నిలిచిపోయింది. వసతి, రవాణా వ్యవస్థలపై ఆందోళనలు ఉన్నప్పటికీ, 503 మంది సభ్యులతో కూడిన భారత బృందం తమ పోటీలకు సిద్ధమవుతోంది.

