కలం, ఖానాపూర్ : జీవో నం.3 (GO 3) రద్దుతో గిరిజనుల హక్కులు, ఉద్యోగ, విద్యా అవకాశాలపై ప్రభావం పడుతోందని ఖానాపూర్ ఎమ్మెల్యే (Khanapur MLA) వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించి మాట్లాడారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనులకు కల్పించిన ప్రత్యేక అవకాశాలను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. జీవో నం.3తో పాటు పలు నిబంధనలు, సుమారు 29 రకాల జీవోలు రద్దు కావడంతో గిరిజన ప్రాంతాల ప్రజలకు నష్టం జరుగుతోందని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకువచ్చారు.
పోలీస్ ఉద్యోగాల్లో 75 శాతం అవకాశం
షెడ్యూల్డ్ ప్రాంతాల స్థానిక గిరిజన యువతకు పోలీస్ నియామకాల్లో 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో గిరిజన యువతకు 75 శాతం పోలీస్ ఉద్యోగాల అవకాశం కల్పిస్తున్న విషయాన్ని వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) ప్రస్తావిస్తూ, తెలంగాణలోనూ అదే విధంగా ప్రత్యేక అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న ఫారెస్ట్, రెవెన్యూ సమస్యలు, విద్యుత్ స్తంభాల మార్పిడి, పారిశుద్ధ్యం, రెవెన్యూ సర్టిఫికెట్ల జారీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రభుత్వాన్ని కోరారు.

