కలం, ఖమ్మం బ్యూరో : ప్రజా ప్రతినిధిగా నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారంలో నిత్యం బిజీగా ఉంటూనే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే (Aswaraopeta MLA) జారె ఆదినారాయణ (Jare Adinarayana) ఎల్ఎల్బీ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. బుధవారం విడుదలైన యూనివర్సిటీ ఫలితాల్లో ఆయన పాసైనట్లు ప్రకటించారు.
అధికారులతో సమీక్షలు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూనే చదువును కొనసాగించడంపై స్థానిక ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయ విద్య వల్ల రాజ్యాంగం, చట్టాలు, ప్రజల హక్కులపై మరింత అవగాహన పెరిగి ప్రజాసేవకు ఉపయోగపడుతుందని అనుచరులు తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్నత బాధ్యతల్లో ఉంటూ చదువును కొనసాగించడం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.

