కలం, జోగులాంబ గద్వాల: వినాయక చవితి సందర్భంగా ఎర్రవల్లి (Yerravalli) మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ (CBSE) స్కూల్లో విద్యార్థులు న్యూస్ పేపర్తో రూపొందించిన పర్యావరణహిత వినాయక విగ్రహాన్ని(Newspaper Ganesh Idol) ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, సిబ్బందికి తీర్థప్రసాదాలు అందజేశారు. గత 15 రోజులుగా విద్యార్థులు ఎంతో ఆసక్తి, శ్రమతో రూపొందించిన ఈ ‘బొజ్జ గణపయ్య’ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ వీర గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. రసాయనాలు, కలుషిత రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీరు కలుషితమై ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా మట్టి, న్యూస్ పేపర్ వంటి సహజ పదార్థాలతో తయారు చేసే వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని సూచించారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. న్యూస్ పేపర్తో అద్భుతమైన వినాయక విగ్రహాన్ని రూపొందించిన విద్యార్థులను, వారికి సహకరించిన ఉపాధ్యాయులను చైర్మన్ అభినందించారు. చిన్నారులకు మంచి విజ్ఞానం, వినయం, విధేయతలు కలగాలని, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డైరెక్టర్ వీర శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ మధులిక రెడ్డి, ప్రిన్సిపాల్ శివకుమార్, వైస్ ప్రిన్సిపల్ ఎండి రఫీ, ఉపాధ్యాయులు లోకేష్, వనజా, వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్ కుమార్, అశోక్, రమేష్, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

