కలం, ఖమ్మం బ్యూరో : ఒకవైపు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకల ఆధ్యాత్మిక ఉత్సాహం ఉరకలెత్తుతున్నాయి. మరొకవైపు తమ నోటి వద్ద కూడు ఎక్కడ ఎగిరిపోతుందోనన్న పేద మత్స్యకారుల ఆకలి కేకలు ఖమ్మం (Khammam) సమీపంలోని ద్వంసలాపురం పెద్ద చెరువు వద్ద తీవ్ర వివాదాన్ని రేపుతున్నాయి. ఊరూరా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథుల నిమజ్జనానికి రంగం సిద్ధమవుతున్న వేళ, చెరువుపైనే ఆధారపడి బతుకుతున్న మత్స్యకార కుటుంబాలు తిరుగుబాటు బావుటా ఎగురవేశాయి.
తమ జీవనోపాధిని పూర్తిగా దెబ్బతీస్తూ చెరువులో విగ్రహాలను నిమజ్జనం (Ganesh Immersion Row) చేయడానికి వీల్లేదని, ముందస్తుగా నష్టపరిహారం చెల్లించడమో లేక నిమజ్జనానికి వేరే ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని వెతుక్కోవడమో చేయాలన్నారు. లేనిపక్షంలో నిమజ్జనాన్ని అడ్డుకొని తీరుతామని అధికారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాయి. ద్వంసలాపురం పెద్ద చెరువు కేవలం ఒక నీటి వనరు మాత్రమే కాదు, కొత్తగూడెం మత్స్యకారుల సొసైటీకి చెందిన సుమారు 80 కుటుంబాలకు అది ఏకైక జీవనాధారం.
ప్రభుత్వం వద్ద లీజుకు తీసుకొని క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తూ, సొసైటీలోని ప్రతీ సభ్యుడు సొంతంగా రూ. లక్షకు పైగా అప్పులు తెచ్చి మొత్తం దాదాపు కోటి రూపాయల భారీ వ్యయంతో చెరువులో చేపల పెంపకాన్ని చేపట్టారు. అయితే వీరి బతుకులకు కష్టాలు కొత్తవేమీ కావు. గతంలో ఖమ్మం నగర పరిధిలోని కలుషిత నీరు చెరువులోకి చేరడంతో టన్నుల కొద్దీ చేపలు చనిపోయి తీవ్ర నష్టాలను చవిచూశారు. దానికితోడు గత మూడేళ్లుగా చెరువంతా గుర్రపుడెక్క వ్యాపించి చేపలు పట్టడానికి వీల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ ఆర్థికంగా చితికిపోయిన తమను, ఇప్పుడు వినాయక నిమజ్జనం మరింత సంక్షోభంలోకి నెడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP)తో రూపుదిద్దుకున్న భారీ విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేస్తే నీరు విషపూరితమై, ప్రస్తుతం పెరుగుతున్న చేపలన్నీ మృత్యువాత పడతాయని మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. అంతేకాకుండా విగ్రహాల తయారీలో వాడే ఇనుప సువ్వలు నీటి అడుగున ఉండిపోయి, నిమజ్జనం ముగిశాక చేపల వేటకు దిగినప్పుడు మత్స్యకారుల కాళ్లకు, చేతులకు గుచ్చుకొని తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉంది. దీనికితోడు చెరువు నీరు కలుషితమవ్వడం వల్ల పరిసర ప్రాంతాల భూగర్భ జలాలు విషపూరితమై, పంట పొలాలకు, తాగునీటికి, మూగజీవాలకు సైతం పెను ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగూడెం మత్స్యకారుల సొసైటీ నాయకులు ముద్రబోయిన అప్పారావు, పగడాల మల్లేష్ అధ్యక్షతన సమావేశమైన మత్స్యకారులు… ప్రభుత్వం ముందు రెండు స్పష్టమైన డిమాండ్లను ఉంచారు. చెరువులో చేపల పెంపకానికి అయిన వ్యయం, రాబోయే నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని, లేదంటే ద్వంసలాపురం చెరువు కాకుండా అధికారులు ఇతర ప్రత్యామ్నాయ ప్రదేశాలు లేదా తాత్కాలిక కుంటలలో నిమజ్జనం ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. మొత్తానికి పండుగ ఉత్సాహం దెబ్బతినకుండా, అదే సమయంలో 80 పేద కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

