కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా నిజాంపేట (Nizampet) మండల కేంద్రంలో విద్యుత్ కోతలు, లో-వోల్టేజ్ సమస్యలను నిరసిస్తూ రైతులు ఆదివారం రోడ్డెక్కారు. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మెదక్-సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా(Farmers Protest) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
లో-వోల్టేజ్ కారణంగా బోరుబావుల వద్ద మోటార్లు తరచూ కాలిపోతున్నాయని రైతులు తెలిపారు. దీంతో వేలాది రూపాయల ఆస్తి నష్టం జరుగుతోందని వాపోయారు. వ్యవసాయ రంగానికి ప్రకటించిన విధంగా ప్రతిరోజూ సరిపడా విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సబ్స్టేషన్ పరిధిలోని సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ అందించాలని కోరారు. లో-వోల్టేజ్ కారణంగా మోటార్లు కాలిపోయిన రైతులకు తగిన సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

