కలం, వెబ్ డెస్క్ : అసెంబ్లీ మీడియా పాయింట్లో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) బీఆర్ఎస్ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫేక్ నాయకులు బయట మాక్ అసెంబ్లీలు నిర్వహిస్తున్నారని, తెలంగాణ ప్రజలు ఇప్పటికే వారిని నిషేధిత నాయకులుగా మార్చేశారని ఎద్దేవా చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న నాయకులు చట్టసభలకు వచ్చే అర్హత కోల్పోయారని అన్నారు. గత మూడేళ్లుగా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్లోనే కుంభకర్ణ నిద్ర పోతున్నారని విమర్శించారు.
అసైన్డ్ భూములు, వక్ఫ్ ఆస్తులు, ప్రభుత్వ భూములను గత ప్రభుత్వ హయాంలో నిషేధిత జాబితాలోకి చేర్చి దర్జాగా కొల్లగొట్టారని ఆరోపణలు చేశారు. అక్రమంగా కాజేసిన ఆ భూముల గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ చర్చలకు రాకుండా పారిపోతున్నారని ధ్వజమెత్తారు. వేల ఎకరాల భూములు, లక్షల కోట్ల రూపాయలు దోచుకుని ఇప్పుడు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారని, సభలో ధైర్యంగా చర్చించలేక బయట తొడలు కొడుతూ విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉందని అంటున్నారని, ఒకవేళ అందులో ఉంటే దాన్ని కూడా పరిశీలనకు పెడతామని తెలిపారు.
Also Read : గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్: సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

