కలం, మక్తల్ : తీవ్రమైన కరెంటు కోతలతో తాము సాగు చేసిన పంటలు ఎండిపోతున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని, తక్షణమే రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నారాయణపేట (Narayanpet) జిల్లా మక్తల్ మండలంలోని గుడిగండ్ల (Gudigandla) లో రైతులు ఆందోళన (Farmers Protest) చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామంలోని 167వ జాతీయ రహదారిపై రైతులు భారీగా బైఠాయించి తమ నిరసన తెలిపారు. ప్రతిరోజు కేవలం 8, 9 గంటలు మాత్రమే కరెంటు సరఫరా చేస్తున్నారని, దీంతో తమ పంటలన్నీ ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్
పేరుకు మాత్రమే 24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఏ మాత్రం కనబడడం లేదన్నారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం గుడిగండ్ల సబ్ స్టేషన్ వద్ద రైతులు బైఠాయించి నిరసన తెలిపారు.

