కలం, మహబూబ్నగర్ బ్యూరో: మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ‘టీమ్ సోషల్ వర్కర్స్’ మహబూబ్నగర్ (Mahabubnagar) ఆధ్వర్యంలో అల్మాస్ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని(Blood Donation Camp) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) హాజరై రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సమాజ సేవలో అంకితభావంతో పనిచేస్తున్న ‘టీమ్ సోషల్ వర్కర్స్’ సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలను అభినందించారు. స్వచ్ఛంద రక్తదానం ప్రాధాన్యతను వివరించారు.
రక్తదానం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సూచించారు. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్న వారు క్రమం తప్పకుండా రక్తదాన కార్యక్రమాలలో పాల్గొని ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తదాతలు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్న అదనపు కలెక్టర్.. ప్రజల్లో రక్తదానంపై అవగాహన కల్పిస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకుల కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ‘టీమ్ సోషల్ వర్కర్స్’ సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలు, రక్తదాతలు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

