కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ జిల్లా నర్సంపేట (Narsampet) పట్టణంలోని ఓ రెస్టారెంట్లో కొందరు రణరంగం సృష్టించారు. ఆరుగురు వ్యక్తులు రెస్టారెంట్లోకి వచ్చి బిర్యానీ ఆర్డర్ చేశారు. అప్పటికే వారు మద్యం తాగి ఉన్నారు. కొద్ది సేపటి తరువాత బిర్యానీ ఎందుకు ఆలస్యంగా ఇచ్చారంటూ గొడవకు దిగారు. సిబ్బంది సర్ది చెబుతుండగానే వినకుండానే మూకుమ్మడిగా దాడికి దిగారు. ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో పాటు క్యాష్ కౌంటర్లోని సిబ్బందితో దుర్భాషలాడుతూ.. కంప్యూటర్లను కింద పడేశారు. గొడవతో కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రెస్టారెంట్ యజమాని యాదగిరి నర్సంపేట పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేశారు.

