కలం, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం త్రివేణి సంగమం (Kaleshwaram)లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పుణ్యస్నానం చేసేందుకు గోదావరిలోకి దిగిన బొబ్బాల శ్రీనివాస్ రెడ్డి (50) ప్రమాదవశాత్తు ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయారు. ఇది గమనించిన నిట్టూరి మహేశ్, దరిపెల్లి శ్రీకాంత్ వెంటనే ఆయనను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఉధృతమైన ప్రవాహం కారణంగా సాధ్యపడలేదు.
అనంతరం స్థానికుల సహాయంతో శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని గోదావరి నుంచి బయటకు తీశారు. ఈ ఘటనతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి స్వగ్రామం, కుటుంబ సభ్యుల వివరాలు సహా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

