కలం, నిజామాబాద్ బ్యూరో: ఆషాడ మాసంలో గ్రామ దేవతలను ప్రత్యేకంగా పూజించడం ఆనవాయితీగా వస్తుందని, ఆ రోజునే నిజామాబాద్ లో ఊర పండగ (Nizamabad Oora Panduga)గా నిర్వహిస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఖిలా వద్ద అమ్మవార్ల గద్దె నుంచి గాజులపేట్, పెద్ద బజార్ మీదుగా వెళ్లే అమ్మవార్ల రూట్ మ్యాప్ను శుక్రవారం పరిశీలించారు. అలాగే మామిడి చెట్టుతో నిష్ఠగా చేసే దేవుళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఈ నెల 2న ఇందూరులో సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఊరపండగ ఘనంగా నిర్వహిస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారని తెలిపారు.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని గద్దెను శ్రీ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అదనపు నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా గద్దె ఎత్తును కూడా పెంచినట్లు తెలిపారు. అలాగే గాజుల పేటలో “సరి” వద్ద ఎటువంటి తోపులాట జరగకుండా పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాల పండుగ సాంప్రదాయంగా వస్తుందని గుర్తు చేశారు. ఇందూరులో అన్ని కుల సంఘాలు ఐక్యంగా నిర్వహించుకునే అతిపెద్ద పండగ ఊర పండగ అన్నారు.
వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామదేవతలను కొలిచే సంప్రదాయం ఇందూరులో మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో సర్వసమాజ్ కమిటీ ప్రతినిధులు బంటు రాజేశ్వర్, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, మల్కాయి మహేందర్, జగదీష్ కులకర్ణి, బంటు రాము, పసునూరి రాము, బెల్లాల్ శశాంక్, వైష్ణవి సుధా, కల్పే అర్చనా చిరంజీవి, జ్యోతి మురళి, ప్రసూన శ్రీనివాస్, ప్రీతి ప్రవీణ్, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, ప్రసన్న శ్యామల సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.

