కలం, వెబ్ డెస్క్: 2034 వరకు తెలంగాణకు తానే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. దీనిలో ఎవరూ అనుమానపడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇక నుంచి విద్యా శాఖ ప్రణాళికలను ఉపాధ్యాయులే రూపొందించి ఇవ్వాలని సూచించారు. వచ్చే డిసెంబర్ నాటికి ప్రతి మండలం వారీగా.. ఎలాంటి విద్య అవసరాలో ఉన్నాయో ఉపాధ్యాయుల ద్వారా తనకు స్పష్టమైన నివేదిక ఇవ్వాలని విద్యా శాఖ కార్యదర్శిని ఆదేశించారు.
ఇక నుంచి విదేశాల్లో శిక్షణ..
సాధారణంగా ఐఏఎస్ అధికారులు స్టడీ లీవ్స్ కోసం విదేశాలకు వెళ్తుంటారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఇక నుంచి టీచర్లను కూడా విదేశాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రతి సంవత్సరం పది మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి, వారిని విదేశాలకు పంపిస్తామన్నారు. అక్కడ విద్యా ప్రణాళికలను అధ్యయనం చేసి, ఇక్కడ అమలు చేసేలా ప్రోత్సహిస్తామన్నారు. ఇందుకు అవసరమైన ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
కేసీఆర్పై విమర్శలు..
గతంలో ఒకాయన నీళ్ల శాఖను తన వద్ద పెట్టుకుని.. కాళేశ్వరం కట్టి కూలేశ్వరం చేశారని కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాను మాత్రం నిరంతరం విమర్శలు ఎదుర్కొనే విద్యా శాఖను తీసుకున్నట్లు వివరించారు. ఎల్కేజీ నుంచి విద్యా వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించామన్నారు. అందుకే, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ప్రభుత్వమే అందిస్తోందన్నారు.
Read Also: ఉస్మానియా ఆస్పత్రిలో మద్యం బాటిళ్లు!
Follow Us On : WhatsApp

