కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో ఒక చారిత్రాత్మక మార్పునకు వేదిక సిద్ధమైంది. ఆగస్టు 17వ తేదీ అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం (Vizag Airport) నుంచి వాణిజ్య విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. అదే సమయం నుంచి నూతనంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రజలకు అందుబాటులోకి రానుంది. వైజాగ్ ఎయిర్పోర్ట్కు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు కోడ్ ఐఏటీఏ (VTZ)ను ఇకపై భోగాపురం ఎయిర్పోర్ట్కు బదిలీ చేయనున్నారు.
ఆగస్టు 17 అర్ధరాత్రి 12:01 గంటల నుంచి వైజాగ్ ఎయిర్పోర్ట్లో విమాన సేవలు నిలిచిపోతాయని, ఆ నిమిషం నుంచే భోగాపురం నుంచి వాణిజ్య విమానాలు తమ సేవలను అందిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వైజాగ్ ఎయిర్పోర్ట్ మూసివేత, భోగాపురం ప్రారంభానికి సంబంధించిన అధికారిక జీవో (G.O.) కూడా విడుదలైంది. వైజాగ్ వచ్చే ప్రయాణికులు ఇకపై తమ ప్రయాణాలను భోగాపురం విమానాశ్రయం ద్వారానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

