కలం, ఖమ్మం బ్యూరో: ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని లయోలా కాలేజీ మైదానంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల జట్టుకు(Telangana Journalists Team) తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) అభినందనలు తెలిపారు.
ఈ టోర్నమెంట్లో తెలంగాణ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి విజయాన్ని అందించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన జర్నలిస్ట్ మానుకొండ రవికిరణ్ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఖమ్మం జిల్లాకు చెందిన విలేకరి సారథ్యంలో తెలంగాణ జట్టు అంతర్రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్గా నిలవడం గర్వకారణమని కొనియాడారు.
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందించడంతో పాటు జర్నలిస్టుల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని మంత్రి తెలిపారు. రెండు రాష్ట్రాల జర్నలిస్టుల మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేయడంలో ఇలాంటి క్రీడా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల జట్టు మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు.

