కలం, ఖమ్మం బ్యూరో: జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా, పారదర్శకంగా సాగుతాయని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. శనివారం కొత్తగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్, నీటిపారుదల, విద్య, వైద్య, వ్యవసాయ, రెవెన్యూ, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతితో పాటు విద్య, వైద్యం, పారిశుధ్యం తదితర సమస్యలపై అధికారులతో క్షుణ్ణంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల పనుల్లో జాప్యం జరిగి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని స్పష్టం చేశారు. పారిశుధ్య లోపం తలెత్తకుండా చూడటంతో పాటు తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజా సమస్యల పట్ల అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వివిధ శాఖల అధికారులు జి.రంగస్వామి, నందయ్య, మధుకర్, శ్రీకాంత్, రాజశేఖర్, నాగేంద్ర, శివలాల్, శ్రీనివాస్, విద్యానగర్ ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళి తదితరులు పాల్గొన్నారు.

