కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల (Munukuntla) గ్రామంలో వరుసగా చోటుచేసుకున్న రెండు మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒకే గ్రామానికి చెందిన యువతి, యువకుడు 24 గంటల వ్యవధిలో మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర ఉత్కంఠ, భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మునుకుంటల గ్రామానికి చెందిన ఒక యువతి నిన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
ఈ ఘటన మరువకముందే.. అదే గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడు శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరుసగా ఇద్దరు యువతీయువకులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ రెండు మరణాలపై కట్టంగూర్ పోలీసులు రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.
శుక్రవారం మృతి చెందిన యువతికి, ఈరోజు ఆత్మహత్య చేసుకున్న చరణ్కు మధ్య ఏదైనా సంబంధం ఉందా?.. వీరి మరణాల వెనుక ప్రేమ వ్యవహారం ఉందా లేక మరేదైనా బలమైన కారణాలు ఉన్నాయా?.. యువతి మృతికి, యువకుడి ఆత్మహత్యకు గల లింక్ ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నామని ఇద్దరి మరణాలపై అనుమానాలు ఉన్నందున అన్ని కోణాల్లోనూ నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని కట్టంగూర్ పోలీసులు తెలిపారు.

