కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) శుక్రవారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా CCTNS-AI పైలట్ ప్రాజెక్ట్ ద్వారా కేసుల దర్యాప్తును వేగవంతంగా, శాస్త్రీయంగా నిర్వహించేందుకు కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
దర్యాప్తులో సాంకేతిక ఆధారాలను సేకరించి కోర్టుల్లో బలమైన సాక్ష్యాలు సమర్పించడం ద్వారా శిక్షల శాతం పెంచడమే ప్రాజెక్ట్ లక్ష్యమని ఎస్పీ తెలిపారు. ప్రతి దర్యాప్తు అధికారి CCTNS-AI వ్యవస్థను సమర్థంగా ఉపయోగించి బాధితులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలని, కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని ఆదేశించారు. ఈ సమావేశంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.

