కలం, వనపర్తి : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు ఓటర్లు బూత్ లెవల్ అధికారులు (BLOలు)కు పూర్తి సహకారం అందించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్కుమార్ (Vinod Kumar) కోరారు. ఎన్యుమరేషన్ ఫారాలను నిర్దేశిత గడువులోగా సమర్పించాలని సూచించారు. వనపర్తి (Wanaparthy) పట్టణంలోని 20వ వార్డు, పీర్లగుట్ట ప్రాంతాలలో శుక్రవారం అదనపు కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా SIR ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. కొన్ని ఇళ్లను స్వయంగా సందర్శించి ఓటర్ల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
ఫారాలు అందాయా? BLOలు ఇంటింటికీ వచ్చి సేకరిస్తున్నారా? అనే అంశాలపై ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఓటరిని చేరుకునేలా BLOలు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించాలని ఆదేశించారు. ప్రతిరోజు సేకరించిన ఫారాల వివరాలను అదే రోజు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఫారాలు నింపడంలో ఓటర్లకు ఏవైనా సందేహాలు ఉంటే BLOలు వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సహాయం అందించాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా SIR ప్రక్రియ పూర్తయ్యేలా GPOలు, BLO సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో తహసీల్దార్తో పాటు మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

