కలం, నిజామాబాద్ బ్యూరో: వినాయక చవితి (Ganesh Chaturthi) పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించే వినాయక చవితి పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. సహజసిద్ధమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి, పర్యావరణానికి హాని కలగకుండా నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
వినాయక మండపాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకోవడం ద్వారా సోదరభావం, సామాజిక ఐక్యత మరింత బలపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించి, ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

