కలం, స్పోర్ట్స్ : న్యూఢిల్లీలో అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్ ప్రారంభం కానున్న వేళ టీమిండియా వ్యూహాలపై మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) తీవ్ర ప్రశ్నలు గుప్పించారు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో జట్టు దిశానిర్దేశంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 2026లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత్ దారుణంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో జట్టు వ్యూహాలు, బౌలింగ్ విభాగం స్థిరత్వంపై కార్తీక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ సంజూ శామ్సన్ (Sanju Samson) పాత్రపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
2026 టీ20 వరల్డ్ కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజూను ఇంగ్లాండ్ సిరీస్ మధ్యలోనే పక్కన పెట్టారని గుర్తుచేశారు. ఆ తర్వాత జింబాబ్వే సిరీస్కు కూడా దూరం పెట్టి, ఇప్పుడు మళ్లీ అఫ్గాన్ సిరీస్కు ఎంపిక చేశారని చెప్పారు. వైభవ్ సూర్యవంశీ ఆగమనం వల్ల బ్యాటింగ్ ఆర్డర్లో తీవ్ర గందరగోళం నెలకొందని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఆసియా గేమ్స్ 2026కి ముందు జట్టు గుర్తింపును, ఆటగాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఈ అఫ్గాన్ సిరీస్ భారత్కు చివరి అవకాశమని కార్తీక్ స్పష్టం చేశారు.

