కలం, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లాలో పులి సంచారంపై డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిపాడు మండలం ధారపల్లి అటవీ ప్రాంతంలో పులి అడుగులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో ప్రజలను వెంటనే అప్రమత్తం చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. పులి అడుగులను బట్టి.. ఎక్కడెక్కడ సంచరిస్తుందో సాంకేతికత సాయంతో నిఘా పెట్టాలని సూచించారు. అటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా పనిచేస్తూ ప్రజలను రక్షిస్తూనే.. పులికి సైతం ఎలాంటి హాని తలపెట్టవద్దన్నారు. అవసరమైన చోట్ల బోన్లు ఏర్పాటు చేసి పట్టుకోవాలన్నారు.
రంగంలోకి హనుమాన్ బృందాలు..
పులిని పట్టుకునేందుకు హనుమాన్ బృందాల సాయం తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా చూడాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే.. ర్యాపిడ్ యాక్షన్ బృందాలను రంగంలోకి దించాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కేరళం పర్యటనలో ఉన్నారు.

