కలం, హనుమకొండ: హనుమకొండ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం (Hanumakonda Registration Office) లో ప్రధాన ద్వారాన్ని మూసివేసి కొత్త ప్రవేశ మార్గాన్ని ఏర్పాటు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలోకి వచ్చే ప్రధాన ద్వారాన్ని ఇటీవల మూసివేసి, సిబ్బంది, ప్రజలు మరో మార్గం ద్వారా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మార్పు వెనుక వాస్తు కారణాలే ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
గత కొంతకాలంగా ఈ కార్యాలయంలో వరుసగా ఏసీబీ దాడులు జరగడం, ఇద్దరు సబ్-రిజిస్ట్రార్లు అవినీతి కేసుల్లో అరెస్టు కావడం, అనంతరం బాధ్యతలు చేపట్టిన అధికారులు కూడా వివాదాలు, ఆరోపణలతో బదిలీ కావడం వంటి పరిణామాల నేపథ్యంలో కార్యాలయానికి వాస్తు దోషం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ప్రధాన ద్వారాన్ని మూసివేసి కొత్త ప్రవేశ మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయంలో వాస్తు పేరుతో ప్రవేశ ద్వారం మార్చడం స్థానికంగా చర్చకు దారితీసింది. గతంలో చోటుచేసుకున్న వరుస ఘటనల నేపథ్యంలో ఈ మార్పు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

