కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లో తాగు నీటిని వృధా చేస్తున్న ఓ వ్యక్తికి జలమండలి (Jalamandali) అధికారులు గట్టి షాకిచ్చారు. ఏకంగా రూ.5 వేల జరిమానా విధించారు. వివరాళ్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 33లో ఓ వ్యక్తి పైప్ పట్టుకొని తాగునీటితో ఇంటి ముందు శుభ్రం చేస్తూ కనిపించాడు. పైపుతో నీటిని వృథాగా పోనివ్వడంపై స్థానికులు జలమండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకోవాలని హెచ్చరిస్తూ, రూ.5 వేల జరిమానాను ఏడు రోజుల్లోగా చెల్లించాలని సదరు వ్యక్తిని ఆదేశించారు. అంతేకాకుండా భవిష్యత్తులో మళ్లీ ఇలాగే నీటిని వృధా చేస్తే తాగునీరు, మురుగునీరు కనెక్షన్లను పూర్తిగా కట్ చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు.

